TG Govt: కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉండొచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారితో పాటు ఎగువన ఉన్నవారికి కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా మంత్రి తెలిపారు. అయితే ఏపీఎల్(Above Poverty Line) వారికి ఇచ్చే రేషన్ కార్డులపై సబ్సిడీతో కూడిన ఎలాంటి రేషన్ సరుకుల సరఫరా ఉండదు. ఏపీఎల్ వారికి సన్నబియ్యాన్ని ఇవ్వాలని భావిస్తున్నా.. బియ్యం సేకరణ ధర, నిర్వహణ ఛార్జీలను కలిపి రేషన్ షాపుల్లో విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. ఇప్పటికే పింక్ కార్డులు ఉన్న వారికి గ్రీన్ కలర్ కార్డులు, తెల్ల కార్డులు ఉన్న వారికి ట్రై కలర్ కార్డులు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ప్రస్తుతం ఉన్న తెల్లరేషన్ కార్డులను మూడు రంగుల్లో జారీ చేయాలని, గులాబీ కార్డులను గ్రీన్ కార్డులుగా మార్చాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి ఇచ్చే కార్డులు ప్రస్తుతానికి గుర్తింపు కార్డులుగా మాత్రమే ఉపయోగపడతాయన్నారు. ఉచితంగా సన్నబియ్యం ఇచ్చే కార్డులపై ఎవరెవరి ఫోటోలు ఉండాలన్నది ప్రస్తుతానికి బయటపెట్టలేమన్నారు.మరో వైపు చిప్ తో కూడి స్మార్ట్ రేషన్ కార్డుల కోసం టెండర్లు ఆహ్వానించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కార్డుల డిజైన్ పూర్తయిందని.. వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. సన్న బియ్యం పంపిణీకి ఇంకా పూర్తి స్థాయిలో సమాయత్తం కాలేదని చెప్పిన మంత్రి ఉత్తమ్.. మే నుంచి బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.