2024 సంవత్సరం భారతదేశానికి ఎన్నో విషాదాలను మిగిల్చింది. వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసిన అనేక మంది ప్రముఖ వ్యక్తులు మనకు దూరమయ్యారు. వారి జీవితాలు, వారు అందించిన సేవలు మన మనసుల్లో ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి.

ప్రముఖ తబలా విద్వాంసుడు, గ్రామీ అవార్డు గ్రహీత జాకీర్ హుస్సేన్ డిసెంబర్ 15, 2024న అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో కన్నుమూశారు. ఆయన తన సంగీతంతో లక్షలాది మంది హృదయాలను కొల్లగోట్టారు.
9 మార్చి 1951న ముంబైలో జన్మించిన జకీర్ హుస్సేన్.. 2023లో పద్మవిభూషణ్, మూడు గ్రామీ అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకున్న ప్రముఖ సంగీతకారుడు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ సంగీత ప్రయాణం చిన్న వయస్సులోనే ప్రారంభమైంది. కేవలం 11 సంవత్సరాల వయస్సులో, ఆయన తన మొదటి సంగీత కచేరీని అమెరికాలో ప్రదర్శించారు.
జకీర్ హుస్సేన్.. తొలి ఆల్బమ్, ‘లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్,’ 1973లో విడుదలైంది. జకీర్ హుస్సేన్ ప్రత్యేక ప్రతిభకు పేరుగాంచిన తవా, థాలీ వంటి వంటగది పాత్రలకు కూడా ఏదైనా చదునైన ఉపరితలాన్ని ఉపయోగించి లయల(సంగీతాన్ని)ను సృష్టిస్తారు. హుస్సేన్.. జార్జ్ హారిసన్ 1973 ఆల్బమ్ లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్, జాన్ హ్యాండీ 1973 ఆల్బమ్ హార్డ్ వర్క్లో భాగస్వామిగా ఉన్నారు. ఆయన వాన్ మోరిసన్ 1979 ఆల్బమ్ ఇన్టు ది మ్యూజిక్ అండ్ ఎర్త్, విండ్ అండ్ ఫైర్ 1983 ఆల్బమ్ పవర్లైట్లో కూడా ప్రదర్శన ఇచ్చారు.

రాజకీయ రంగంలో సీతారాం ఏచూరి:
సీనియర్ రాజకీయ నాయకులు, సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి సెప్టెంబర్ 12, 2024న కన్నుమూశారు. ఆయన తన జీవిత కాలం అంతా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి, కార్మికుల హక్కుల కోసం పోరాడారు. ఆయనకు తెలుగు రాష్ట్రాలతో ప్రత్యేక అనుబంధం ఉంది. కాలమిస్టుగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన ఏచూరి 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా 1992 నుంచి కొనసాగారు. తొలిసారిగా 1974లో ఎస్ఎఫ్ఐలో చేరి 1975లో సీపీఎం ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. 1984లో సీపీఎం కేంద్ర కమిటీకి ఎంపికయ్యారు.

మీడియా రంగంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు జూన్ 8న కన్నుమూశారు. మీడియా రంగంలో ఆయన ఎనలేని సేవలు అందించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు పత్రిక, ఈటీవీ చానళ్ల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. ప్రజలకు, రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను ఆయన తన మీడియా ద్వారా చేరవేశారు. విపత్తుల సమయంలో సేవా కార్యక్రమాలతో బాధితులకు అండగా నిలిచారు.
ఉస్తాద్ రషీద్ ఖాన్:
ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ జనవరి 9, 2024న మరణించారు. ఆయన తన మధురమైన స్వరంతో అందరినీ అలరించారు.

భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం(డిసెంబర్ 26, 2024) రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1932, సెప్టెంబర్ 26, మన్మోహన్ సింగ్ ప్రస్తుతం పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలోని గాహ్లో జన్మించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో డాక్టరేట్ పొందారు. కేంబ్రిడ్జ్ నుంచి పీజీ పట్టా పొందారు. ప్లానింగ్ కమిషన్ చీఫ్గా, ఎకనామిక్ అడ్వైజర్గా భారత ప్రభుత్వంలో కీలక పదవుల్లో పనిచేశారు. 1991లో తొలిసారి మన్మోహన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు.
ఆ తర్వాత ఐదుసార్లు అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1991-96 వరకు అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు మన్మోహన్ సింగ్. తొలి సిక్కు ఆర్థికమంత్రిగా ఆయన రికార్డుల్లోకెక్కారు. భారత ఆర్థిక ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ ఘనత వహించారు.ఇక, 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో భారత ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ సేవలందించారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే ఉపాధి హామీ, ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చాయి. 2024లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేశారు. పద్మవిభూషణ్ సహా అనేక అవార్డులు, పురస్కారాలను మన్మోహన్ అందుకున్నారు.మన్మోహన్ సింగ్ ప్రజా సేవా జీవితంలో పొందిన అనేక పురస్కారాలు, గౌరవాలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనవి భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ (1987), జవహర్లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం (1995), ఆసియా మనీ అవార్డు ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ (1993-1994), యూరో మనీ అవార్డు ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ (1993), యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఆడమ్ స్మిత్ ప్రైజ్ (1956), సెంట్రల్ లండన్ లోని సెంట్ జాన్ కాలేజ్ ద్వారా ప్రదర్శనలో ప్రఖ్యాతి చెందిన రైట్ ప్రైజ్ (1955) ఉన్నాయి. అలాగే, పలు దేశాలు అత్యున్నత పురస్కారాలు కూడా అందుకున్నారు మన్మోహన్ సింగ్.