న్యూఢిల్లీ: చైనాలో హ్యూహన్ మెటానిమోవైరస్ (హెచ్ఎంపీవీ) విజృంభిస్తోందని, భారత్లోనూ కేసులు వెలుగు చూస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపింది. హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదని, 2001లో తొలిసారి గుర్తించగా, చాలా ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతున్నట్టు నిపుణులు వివరణ ఇచ్చారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) తెలిపారు. గాలి ద్వారా, రెస్పిరేషన్ ద్వారా హెచ్ఎంపీవీ వ్యాప్తి జరుగుతుందన్నారు.
HMPV : పిల్లలలో వైరస్ ఎందుకు వేగంగా వ్యాపిస్తోంది?
”అన్ని వయస్సుల వారిపైనా దీని ప్రభావం ఉండొచ్చు. చలికాలంలో ఎక్కువగా ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుంది. చైనాలో హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూసినట్టు వార్తలు రావడంతో చైనాతో పాటు, పొరుగుదేశాల్లో పరిస్థితిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ క్షణ్ణంగా అధ్యయనం చేస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనేజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) సైతం పరిస్థితిపై త్వరలోనే ఒక రిపోర్ట్ను మనతో పంచుకోనుంది. భారత్లో పరిస్థితిపై హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ ఈనెల 4న సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ఆరోగ్య నిఘా వ్యవస్థలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. దేశంలో ఎలాంటి ఆరోగ్య సవాళ్లు ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నాం. ఆందోళన పడాల్సి పని లేదు. పరిస్థితి నిశితంగా గమనిస్తున్నాం” అని జేపీ నడ్డా తెలిపారు.