Telangana: సిద్ధిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ డ్యాంలో సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లిన ఆ యువకులను మృత్యువు బలితీసుకుంది. డ్యాంలో పడి ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు.
సిద్దిపేట, జనవరి 11: వారంతా స్నేహితులు. సంక్రాంతి పండుగకు సెలవులు వచ్చేయడంతో ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయాలని భావించారు. అందుకు వారు ఎంచుకున్న ప్లేస్ సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ డ్యామ్. ఎంతో సరదాగా.. అక్కడా బాగా ఎంజాయ్ చేసేందుకు ఏడుగురు యువకులు తమ తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరారు. కానీ అదే వారికి చివరి చూపు అవుతుందని తల్లిదండ్రులు భావించలేదు. సరదాగా గడపడానికి వెళ్లిన వారి వెనకే మృత్యువు ఉందని గ్రహించలేకపోయారు యువకులు.. అనుకున్న విధంగా డ్యాం దగ్గరు చేరుకున్న ఆ ఏడుగురు యువకులు.. ఈత కొట్టాలని భావించారు. అంతా కలిసి డ్యాంలోకి దిగారు.. ఇంతలో ఏం జరిగిందో తెలియదు ఒకరి ఒకరి తర్వాత డ్యాంలో పడి గల్లంతయ్యారు. వీరు మునిగిపోతున్నట్లు గుర్తించిన గత ఈతగాళ్లు వెంటనే రంగంలోకి దిగారు. కానీ అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది. సిద్ధిపేట జిల్లాలో (Siddepet district) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదా కోసం ఈతకు వెళ్లిన ఆ యువకులకు విషాదమే మిగిలింది.
జిల్లాలోని మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి ఐదుగురు యువకులు మృతి చెందారు. మృతులు హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. ముందుగా యువకులు గల్లంతయ్యారన్న విషయం తెలిసిన వెంటనే వారి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం ఏడుగురు యువకుడు డ్యాంలో పడిపోగా.. వారిలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు గజ ఈతగాళ్లు.
మృతులు ధనుష్ (20), లోహిత్ (లక్కీ) (17), చీకట్ల దినేశ్వెర్ (17), సాహిల్ (19), జతిన్ (17)గా గుర్తించారు. అలాగే కొమరి మృగంక్ (17), ఎండీ ఇబ్రాహీం(20) సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరి మృతి విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సరదా వెళ్లిన తమ బిడ్డలు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రుల శోకం వర్ణణాతీతం. యువకుల మృతి వార్త తెలిసి ముషీరాబాద్లోనూ విషాదఛాయలు అలముకున్నాయి.