వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిన్న ప్రెస్ మీట్ సందర్భంగా ఈ మధ్య పార్టీకి వరుసగా గుడ్ బై చెబుతున్న నేతల ప్రస్తావన వచ్చింది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు జగన్ ఘాటుగా స్పందించారు. సాయి రెడ్డి కావచ్చు వెళ్లిపోయిన వాళ్లు కావచ్చు, వెళ్లబోయే వాళ్లు కావచ్చు, ఎవరికైనా వ్యక్తిత్వం ముఖ్యమని అన్నారు. ఏపీలో రాజ్యసభ ఎంపీ పదవిని పదవిని వదిలేసి, రాజకీయాలకే గుడ్ బై చెప్పేసిన వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పేయడంపై నిన్న పార్టీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ ఆయన్ను తిరిగి నిద్రలేపాయి. జగన్ కామెంట్స్ కు ఇవాళ ఆయన ఎక్స్ లో ఘాటు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా తన క్యారెక్టర్ పై జగన్ చేసిన కామెంట్స్ కు సాయిరెడ్డి ఇచ్చిన రిప్లై చర్చనీయాంశమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరింపులు, ప్రలోభాలు కామన్గా ఉంటాయని వాటికి నిలబడిన వాళ్లనే ప్రజలు గుర్తు పెట్టుకుంటారని అన్నారు. అలా కాకుండా వాటికి భయపడి వెళ్లిపోయిన వాళ్లను పట్టించుకోరని అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఓపిక అవసరమన్నారు. ఇలా దేనికో ఒకదానికి లొంగిపోయి పార్టీలు వీడితే గౌరవం ఉంటుందా అని జగన్ ప్రశ్నించారు. క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలని ఆయన అన్నారు. ఇలా తనకు క్రెడిబులిటీ లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై సాయరెడ్డి అంతే ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో సాయిరెడ్డి.. ఎక్కడా జగన్ పేరెత్తకుండానే చెప్పాల్సింది చెప్పేశారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు. భయం అనేది తనలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా అంటూ సాయిరెడ్డి స్పష్టంచేశారు.