విజయవాడలో మరో రోడ్డు పేరుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో గతంలో ఉన్న మహానాడు రోడ్డు పేరును యథాతథంగా ఉంచాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక టీడీపీ నేత దేవినేని అవినాష్ ప్రోద్బలంతో మహానాడు రోడ్డు పేరును దేవినేని రాజశేఖర్ రోడ్డు పేరుగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ రోడ్డుకు మహానాడు పేరు కొనసాగించాలని స్థానికుల నుంచి భారీగా విజ్ఞప్తులు ప్రభుత్వానికి వచ్చాయి.
విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుకు స్థానికుల విజ్ఞప్తితో పాటు రోడ్డు చరిత్రను వివరిస్తూ మున్సిపల్ కమిషనర్కు లేఖ కూడా రాశారు. వెంటనే ఈ లేఖపై స్పందించి రికార్డును పరిశీలించారు. అలాగేమున్సిపల్ కమిషనర్ సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. కౌన్సిల్ తీర్మానం వివాదాస్పదంగా ఉండటంతో ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ ఆంధప్రేదశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సెక్షన్ 679ఏ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1995 ప్రకారం ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవోను జారీ చేశారు.
1990లో నేషనల్ హైవే 16 నుంచి బల్లెంవారి వీధి వరకు మున్సిపల్ కార్పొరేషన్లోకి కలిసింది. ఆ తర్వాత ఈ రోడ్డు పేరును మహానాడు రోడ్డు స్థానికులు పిలిచేవారు. స్థానికంగా గుర్తింపు కోసం, అడ్రస్, ల్యాండ్ మార్క్గా మహానాడు రోడ్డుగా మారింది. ఆ తర్వాత కార్పొరేటర్లు తమ కౌన్సిల్ ఎజెండాలో మహానాడు రోడ్డుకు సంబంధించి అనేక మౌలిక సదుపాయాల పనులను సిఫార్సు చేశారు. అందుకు బదులుగా మున్సిపల్ కార్పొరేషన్ కూడా మహానాడు రహదారి పేరుతో అనేక ప్రతిపాదనలను ఆమోదించింది.