జగన్‌కు చురకలంటించిన లోకేష్

అమరావతి, ఫిబ్రవరి 18: వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్‌పై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. తన ఎక్స్ ఖాతా వేదికగా వ్యంగ్య బాణాలు సంధించారు. నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డి గారు? అంటూ ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్‌గా చెప్పడంలో మీరు పీహెచ్‌డీ చేసినట్లు ఉన్నారంటూ వైఎస్ జగన్‌కు చురకలంటించారు.

మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండంటూ ఆయనకు సూచించారు. 100 మందికిపైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయడాన్ని కోట్లాది ప్రజలు కళ్లారా చూశారని గుర్తు చేశారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు అంటూ ఆయనకు గుర్తు చేశారు. అధికారం ఉన్నప్పుడు యథేచ్చగా చట్టాలను తుంగలో తొక్కి.ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ మీరు లెక్చర్ ఇవ్వడం వింతగా ఉందంటూ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
వారి వీడియోలు ప్లే చేసి చూసుకో..

ఇక హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మంగళవారం అమరావతిలో స్పందిస్తూ.. బూతులేంటో తెలియాలంటే ఆర్కే రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్, పేర్ని నాని, గోరంట్ల మాధవ్‌ల వీడియోలు ప్లే చేసి చూసుకోవాలంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సూచించారు. నేరస్తుడైన పులివెందుల ఎమ్మెల్యే మరో నేరస్తుడిని సబ్ జైల్‌లో కలిసి కట్టుకథలు బాగా అల్లాడంటూ వ్యంగ్యంగా అన్నారు. అబద్ధాల కథలు అల్లటంలో తనకు తానే సాటి అని మరో సారి జగన్ రుజువు చేసుకున్నాడని ఆమె పేర్కొన్నారు.
ఎలాంటి కథలైనా అల్లేస్తాడు..

దళితులంటే వైసీపీ నేతలకు ఎందుకంత చులకన? అంటూ మంత్రి వంగలపూడి అనిత సందేహం వ్యక్తం చేశారు. ఎస్సీ అయితే తనకు లొంగాల్సిందే అనే అహంకార ధోరణా? అని ఆమె ప్రశ్నించారు. నాలుగు కాగితాలు, మరో నాలుగు మైకులు ముందుంటే ఎలాంటి కథలైనా జగన్ అల్లేస్తాడన్నారు. పోలీసులను తొత్తులుగా వాడుకుని నిరాధారమైన కేసులు పెట్టి నాడు జగన్ ఎందరో నిరపరాధుల్ని జైల్లో పెట్టించాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కార్యకర్తల్ని బుజ్జగించుకుంటున్నాం..

ఈ రోజు అరెస్ట్‌పై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని.. అలాగే ఫిర్యాదుదారుడు సైతం ఉన్నాడని వివరించారు. మేం కక్షసాధింపులకు పాల్పడాలనుకుంటే…, ఈ ఎనిమిది నెలల్లో ఎవ్వరూ బయట తిరిగే వారు కూడా కాదన్నారు. కక్ష సాధింపులు వద్దు… రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని తమ కార్యకర్తల్ని బుజ్జగించుకుంటున్నామని తెలిపారు. బట్టలూడతీసి వైఎస్ జగన్ కొడతామంటున్నారని.. మరి గతేడాది జరిగిన ఎన్నికల్లో ప్రజలు అదే పని.. చేసి చూపింది సరిపోలేదా? అని అంటూ ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ గేటు దాట లేని..

అసెంబ్లీ గేటు సైతం దాట లేని పరిస్థితిలో వైఎస్ జగన్ ఉన్నాడన్నారు. గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్థన్‌ను ఏ విధంగా బెదిరించి.. భయపెట్టి.. కిడ్నాప్ చేశాడో బాధితుడి కుటుంబసభ్యులే వివరించారన్నారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడిలో వల్లభనేని వంశీ పాత్ర ఉందని ఆనాడే తేలిందన్నారు. ఆ క్రమంలోనే బెయిల్ కోసం అతడు కోర్టుకెళ్లాడని.. ఈ విషయం సైతం వైఎస్ జగన్‌కు తెలీదా? అంటూ సందేహం వ్యక్తం చేశారు.
విజయవాడ సబ్ జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మంగళవారం ఉదయం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం జైలు బయట వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత పైవిధంగా స్పందించారు.

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು